
పవన్.. ఆరో క్లాసులో ఒకడ్ని చంపేద్దామనుకున్నాడు
ఒక సంప్రదాయ రాజకీయ నాయకుడు ఎలా అయితే మాట్లాడతారో.. అలా మాట్లాడకుండా ఉండటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రమే సాధ్యమేమో అన్నట్లుగా ఉంటాయి ఆయన వ్యాఖ్యలు. ఒక స్నేహితుడితోనో.. సన్నిహితుడితోనో కూర్చొని మాట్లాడితే ఎలా మాట్లాడతారో సరిగ్గా అలానే వేలాది మందిని ఉద్దేశించి కూడా మాట్లాడటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందేమో. రాసుకొచ్చిన మాటల్ని వల్లె వేయటం.. పంచ్ డైలాగులు విసరటం.. ఆకట్టుకునేలా పిట్టకథలు చెప్పటం పవన్ కు ఇష్టం ఉండదు.
తనకు ఎదురైనా.. తనకు తెలిసిన విషయాల్ని ప్రస్తావించే ఆయన మాటలు వింటే.. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్లుగా అస్సలు అనిపించదు. తాను ఆరోతరగతి చదివే సమయంలో ఒకడ్ని తాను చంపేయాలని అనుకున్నానన్న విషయాన్ని వేలాదిమంది ప్రజల ముందు చెప్పగలరా? అంటే లేదనే చెప్పాలి. వీలైనంత మంచితనంతో కూడిన మాటలు మాట్లాడటం.. తనను తాను గొప్ప వ్యక్తిగా.. అరుదైన వ్యక్తిగా అభివర్ణించుకునే నేతలకు భిన్నంగా తనను తాను ఒక సామాన్యుడిగా.. సగటు జీవిగా చెప్పుకోవటం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుంది.
తాజాగా అనంతపురం జిల్లా గుత్తిలోని ఒక కళాశాలలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా విద్యార్థి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన విద్యార్థి.. తన బాల్యం గురించి చెప్పుకొచ్చారు. తాను ఆరో తరగతి చదివే సమయంలో తన అక్కను ఒక రౌడీ ఏడిపించారన్నారు. తన తండ్రి పోలీస్ శాఖలో పని చేస్తున్నా.. తన అక్కను ఏడిపించిన విషయాన్ని చూసి తట్టుకోలేకపోయానని.. ఆ సమయంలో ఆ రౌడీని చంపేయాలనిపించినట్లు చెప్పారు. తన అక్కను ఏడిపించిన రౌడీని చంపేసి జైలుకు వెళితే.. అని కూడా ఆలోచించిన విషయాన్ని చెప్పిన ఆయన.. ఏ ఆడపిల్లకైనా అవమానం జరిగితే.. చుట్టూ ఉన్న పది మంది స్పందిస్తే సరిపోతుందని.. అలాంటి వైఖరి ప్రజల్లో పెరగాలన్న భావనను వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment